శ్రీరామనవమి అనగానే అందరికీ గుర్తొచ్చేది భద్రాచలం(Bhadrachalam). దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రతిదీ ఓ అద్భుతమే. రామ భక్తుడు రామదాసు నిర్మించిన ఆలయంగా భద్రాచలం చరిత్రకెక్కింది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం ఆలయంలో జరిగే సీతారామస్వామి కళ్యాణ వేడుకను చూసేందుకు రెండు కళ్లు చాలవు. భద్రాచల ఆలయానికి అనుంబంధంగా కొనసాగుతున్న మిథిలా స్టేడియంలోని ‘మిథిలా మండపం’లో రామయ్య కల్యాణం జరగనుంది. మిథిలా పురాధీశుడి కుమార్తె అయిన సీతమ్మను శ్రీరాముడు స్వయం వరంలో వివాహం చేసుకుంటాడు.
అందుకే భద్రాచలంలో సీతారాముల కల్యాణం జరిగే ప్రదేశాన్ని మిథిలా స్టేడియం అని పెట్టారు. వాస్తవానికి భద్రాచల ఆలయం నిర్మించిన తొలి రోజుల్లో ఆలయంలోనే స్వామివారి కల్యాణాన్ని జరిపించే వారట. రామదాసు దానిని రద్దుచేసి అందరి సమక్షంలో కుల, మత, వర్గ భేదం లేకుండా బహిరంగ ప్రదేశంలో సీతారాముల కల్యాణం నిర్వహించారట. 1958లో ‘భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన ఆలయ పునరుద్ధరణ సంఘం’ పేరుతో ప్రత్యేకంగా ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి అధ్యక్షులుగా వ్యవహరించారు. దాదాపు 20 వేల మంది భక్తులు.. ఒకే చోట కూర్చొని సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా ప్రధాన ఆలయం సమీపంలోనే ఐదు ఎకరాల స్థలంలో ‘మిథిలా స్టేడియాన్ని’ నిర్మించ తలపెట్టారు. 1960 మే 30 న మిథిలాస్టేడియం నిర్మాణానికి భూమి పూజ చేశారు. 1964 జూన్ 4న అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా మిథిలా స్టేడియాన్ని ప్రారంభించారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణానికి మిథిలా మండపం వేదికగా నిలుస్తుంది. అదే ఇప్పటికీ ఆనవాయితీగా కొనసాగుతోంది. మిథిలా మండపం సాంప్రదాయ దక్షిణ భారతీయ ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. దీని స్తంభాలు, శిల్పాలు రామాయణ ఘట్టాలను వర్ణిస్తూ ఉంటాయి, ఇది దర్శనీయంగా మరియు ఆధ్యాత్మికంగా ఆకర్షణీయంగా ఉంటుంది.
Also Read: