నేడు స్కంద షష్టి (Skanda Shashti) పర్వదినం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెల శుక్ల పక్షంలోని షష్ఠి తిథి రోజున ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ రోజు ప్రధానంగా కుమారస్వామికి అంకితం చేయబడింది. ఆయనను సుబ్రహ్మణ్యుడు, మురుగన్, శరవణభవుడు వంటి అనేక పేర్లతో భక్తులు పూజిస్తారు. ముఖ్యంగా తమిళ సంప్రదాయంలో ఈ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. పళణి, తిరుత్తణి వంటి ప్రసిద్ధ ఆలయాల్లో ఈ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
ఈసారి వైశాఖ శుక్ల షష్ఠి (Skanda Shashti) తిథి ఏప్రిల్ 21 తెల్లవారుజామున ప్రారంభమై, ఏప్రిల్ 22 రాత్రి వరకు కొనసాగుతుంది. ఉదయ తిథిని ప్రామాణికంగా తీసుకుని ఏప్రిల్ 22న వ్రతాన్ని ఆచరించడం శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజు భక్తులు ఉదయాన్నే లేచి స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి వ్రత సంకల్పం చేయాలి. పూజ కోసం ఒక పీఠంపై ఎరుపు వస్త్రాన్ని పరచి, కార్తికేయుని విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించాలి. కుమారస్వామితో పాటు శివపార్వతులను పూజించడం కూడా సంప్రదాయం.
పూజా విధానంలో భాగంగా పంచామృతం, పవిత్ర జలంతో అభిషేకం చేయాలి. అనంతరం చందనం, కుంకుమ, అక్షతలు సమర్పించాలి. నీలిరంగు పుష్పాలు, నెమలి ఈకలు స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనవి కాబట్టి వాటిని ప్రత్యేకంగా సమర్పిస్తారు. ధూపదీపాలతో పూజ చేసి, పండ్లు, మిఠాయిలను నైవేద్యంగా అర్పించాలి. పూజ సమయంలో “ఓం స్కందాయ నమః” లేదా “ఓం శరవణభవాయ నమః” మంత్రాలను జపించడం విశేష ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం. చివరగా హారతి ఇచ్చి వ్రతాన్ని ముగించాలి.
స్కంద షష్టి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంతానం లేని దంపతులకు శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం. అలాగే శత్రువులపై విజయం, ఆత్మవిశ్వాసం పెంపొందడం, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోవడం వంటి ప్రయోజనాలు లభిస్తాయని విశ్వాసం ఉంది. అయితే ఈ రోజు ఆచరణలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. తామసిక ఆహారాలు, మద్యపానం వంటి వాటిని దూరంగా ఉంచాలి. కోపం, వివాదాలు, ఇతరులను దూషించడం వంటి నెగెటివ్ ప్రవర్తనలను నివారించాలి. సాధ్యమైనంత వరకు నేలపై నిద్రించడం, పేదలకు దానం చేయడం మంచిదిగా భావిస్తారు.
మొత్తానికి స్కంద షష్టి వ్రతం ఆధ్యాత్మిక శక్తిని పెంచే పవిత్ర ఆచారం. భక్తి, నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని పాటిస్తే కోరుకున్న ఫలితాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
Alsp read:
