గుంటూరు (Guntur) జిల్లాలో ఓ రైతు జీవితంలో చోటుచేసుకున్న ఆందోళనకర ఘటనకు పోలీసులు సుఖాంతం పలికారు. ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంటను విక్రయించి వచ్చిన రూ.1.50 లక్షల నగదు క్షణాల్లో పోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన రైతుకు, గుంటూరు లాలాపేట పోలీసులు గంటల వ్యవధిలోనే డబ్బును తిరిగి అందించి ఊరటనిచ్చారు. ఈ ఘటన పోలీసుల అప్రమత్తతకు మరో ఉదాహరణగా నిలిచింది.
గుంటూరు (Guntur) నగరంలోని చుట్టుగుంట ప్రాంతానికి చెందిన రైతు మారిశెట్టి బ్రహ్మయ్య ఇటీవల తన మిర్చి పంటను మార్కెట్లో విక్రయించాడు. పంట అమ్మకంతో వచ్చిన రూ.1.50 లక్షలను ఒక సంచిలో భద్రపరుచుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. అయితే ఇంటికి చేరుకుని చూసేసరికి నగదు ఉన్న సంచి కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. తన కష్టార్జిత సొమ్ము పోయిందని గ్రహించిన రైతు వెంటనే లాలాపేట పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
రైతు ఆవేదనను గుర్తించిన సీఐ శివప్రసాద్ వెంటనే కేసును సీరియస్గా తీసుకుని సిబ్బందిని రంగంలోకి దించారు. కానిస్టేబుళ్లు కిరణ్, శంకర్లతో కలిసి రైతు ప్రయాణించిన మార్గంలోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను జాగ్రత్తగా పరిశీలించారు. విచారణలో ఎత్తురోడ్డు ప్రాంతం వద్ద ప్రయాణిస్తున్న సమయంలో రైతుకు తెలియకుండానే నగదు సంచి బైక్ నుంచి కింద పడిపోయినట్లు గుర్తించారు. అనంతరం అదే మార్గంలో వెళ్తున్న మరో వ్యక్తి ఆ సంచిని తీసుకుని వెళ్లిన దృశ్యాలు కెమెరాల్లో నమోదయ్యాయి.
సీసీటీవీ ఆధారాలను విశ్లేషించిన పోలీసులు సంబంధిత వ్యక్తి బైక్ నంబర్ను గుర్తించి అతడిని గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకుని తిరిగి రైతుకు అందజేశారు. పోయిందనుకున్న డబ్బు తిరిగి లభించడంతో రైతు బ్రహ్మయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పోలీసులకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఘటనతో సీసీటీవీ వ్యవస్థ నేరాల ఛేదనలో ఎంత కీలకంగా మారిందో మరోసారి స్పష్టమైంది. అలాగే ప్రజలు విలువైన నగదు లేదా వస్తువులను తరలించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను ఆశ్రయిస్తే వేగంగా స్పందించి సహాయం అందించగలమని అధికారులు తెలిపారు. గుంటూరు లాలాపేట పోలీసుల చాకచక్యంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also read:
