భారతీయ సనాతన ధర్మంలో (JyeshthaPurnima) జ్యేష్ఠ పౌర్ణమికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. పౌర్ణమి తిథి ప్రతి నెలా పవిత్రమైనదే అయినప్పటికీ, జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని శాస్త్రాలు పేర్కొంటాయి. ఈ రోజున శ్రీమహావిష్ణువుని,లేదా మహాలక్ష్మీదేవిని, లేదా పరమశివుడుని, లేదా చంద్రభగవానుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, సుఖసంతోషాలు నెలకొంటాయని విశ్వాసం.

జ్యేష్ఠ పౌర్ణమి (JyeshthaPurnima) రోజున అనేక మంది భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతంతో పాటు సత్యనారాయణ స్వామి కథను పారాయణం చేయడం వల్ల కుటుంబంలో ఆనందం, ఐకమత్యం పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే వివాహిత మహిళలు వట సావిత్రి వ్రతాన్ని ఆచరించి మర్రి చెట్టుకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వ్రతం ద్వారా భర్తకు దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం.

ఈ పవిత్రమైన రోజున దానధర్మాలకు కూడా విశేష ప్రాధాన్యం ఉంది. అన్నదానం, వస్త్రదానం, తాగునీరు, పండ్లు వంటి అవసరమైన వస్తువులను పేదలకు అందించడం మహా పుణ్యకార్యంగా భావిస్తారు. అలాగే గంగా వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం లేదా ఇంట్లోనే పవిత్ర జలాలతో స్నానం చేసి దేవుడిని ప్రార్థించడం ద్వారా పాప విమోచనం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి.
![]()
సాయంత్రం చంద్రోదయం సమయంలో చంద్రుడికి పాలతో లేదా స్వచ్ఛమైన నీటితో అర్ఘ్యం సమర్పించడం కూడా జ్యేష్ఠ పౌర్ణమి రోజున ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరగడంతో పాటు చంద్రగ్రహానికి సంబంధించిన దోషాలు తగ్గుతాయని విశ్వాసం.
పూజా విధానంలో భాగంగా ఉదయాన్నే పవిత్ర స్నానం చేసి పూజా గదిని శుభ్రం చేయాలి. అనంతరం శ్రీమహావిష్ణువు లేదా మహాలక్ష్మీదేవి విగ్రహాలను పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించి పండ్లు, పంచామృతం, తాంబూలాన్ని నైవేద్యంగా సమర్పించాలి. హారతి అనంతరం ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు.
)
గమనిక: జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా పాటించే ఆచారాలు, వ్రతాలు ప్రాంతీయ సంప్రదాయాలు, కుటుంబ ఆచారాల ప్రకారం మారవచ్చు. భక్తులు తమ కుటుంబ సంప్రదాయం లేదా పండితుల సూచనలను అనుసరించడం మంచిది.
Also read:
