ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI), ఆటోమేషన్ ప్రభావం వేగంగా పెరుగుతున్న వేళ అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్ (GeneralMotors) తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. కంపెనీ తన డెట్రాయిట్లోని ఫ్యాక్టరీ జీరో (Factory Zero) ప్లాంట్లో వెయ్యికి పైగా ఉద్యోగులను తొలగించి, వారి పనిలో భాగాన్ని 50 సహకార రోబోట్లతో (Cobots) నిర్వహించేలా మార్పులు చేసింది. ఈ పరిణామం కార్మిక సంఘాలు, ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమైంది.
సమాచారం ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ తగ్గడం, ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం వంటి కారణాలతో జీఎం ఈ నిర్ణయం తీసుకుంది. ప్లాంట్లో అమర్చిన కొత్త రోబోలు వాహనాల అసెంబ్లింగ్ ప్రక్రియలో మానవ ఉద్యోగులతో కలిసి పనిచేస్తున్నాయి. ముఖ్యంగా వాహనాల బాడీ ప్యానెల్స్ అమర్చే పనిలో ఈ రోబోలను వినియోగిస్తున్నారు.

అయితే ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల స్థానంలో యంత్రాలను తీసుకురావడం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని యునైటెడ్ ఆటో వర్కర్స్ (UAW) నాయకులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాల భద్రతతో పాటు రోబోలు, మనుషులు కలిసి పనిచేసే సమయంలో భద్రతా సమస్యలు కూడా తలెత్తే అవకాశముందని వారు పేర్కొన్నారు.
మరోవైపు (GeneralMotors) జీఎం మాత్రం ఈ రోబోలు భద్రతను మెరుగుపరచడమే కాకుండా ఉత్పాదకతను పెంచుతాయని చెబుతోంది. ఆధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా సంస్థ పోటీ ప్రపంచంలో నిలబడగలదని, భవిష్యత్తు పరిశ్రమలు ఆటోమేషన్ వైపే పయనిస్తున్నాయని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఈ ఘటనతో “మనిషి వర్సెస్ రోబో” అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఒకవైపు సాంకేతికత అభివృద్ధి అవసరమని నిపుణులు చెబుతుండగా, మరోవైపు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయనే భయం ఉద్యోగుల్లో కనిపిస్తోంది. భవిష్యత్తులో AI, రోబోటిక్స్ ప్రభావం మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also read:
