పెంపుడు కుక్కల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని అరికట్టేందుకు (Kerala) కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లైసెన్స్ లేకుండా పెంపుడు కుక్కలను పెంచడం, అనుమతులు లేకుండా కుక్కల బ్రీడింగ్ సెంటర్లు నిర్వహించడం, అలాగే పెంపుడు కుక్కలను నిర్లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో వదిలేయడం వంటి ఉల్లంఘనలకు రూ.10 వేల వరకు జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. ఈ చర్యల ద్వారా ప్రజల భద్రతను మెరుగుపరచడంతో పాటు బాధ్యతాయుతమైన పెంపుడు జంతు సంరక్షణను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇటీవల వీధి కుక్కల సమస్యపై న్యాయస్థానాల సూచనల నేపథ్యంలో (Kerala) రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఆగస్టు 7లోపు వీధి కుక్కల నిర్వహణ, నియంత్రణ, ప్రజల భద్రతకు సంబంధించిన కార్యాచరణ నివేదికను కేరళ హైకోర్టుకు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ (LSGD), పశుసంవర్ధక శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 8 లక్షల పెంపుడు కుక్కలు, 4 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా. ఇటీవల కొందరు యజమానులు తమ పెంపుడు కుక్కలను కూడా రోడ్లపై వదిలివేయడం పెరగడంతో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది.

అధికారుల ప్రకారం, వీధి కుక్కల నిర్వహణలో ప్రజల భద్రత, జంతు సంక్షేమం, జనాభా నియంత్రణ, చట్టాల అమలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపడుతున్నారు. స్థానిక సంస్థలకు అవసరమైన మార్గదర్శకాలు ఇప్పటికే పంపించినట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో ఛత్తీస్గఢ్లోని బగోడ్ గ్రామంలో గ్రామ పంచాయతీ కూడా వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలో పెంపుడు కుక్క ఎవరినైనా కరిస్తే సంబంధిత యజమానికి రూ.5 వేల జరిమానా విధించాలని నిర్ణయించింది. కుక్కల యజమానులు తమ పెంపుడు జంతువులపై పూర్తి బాధ్యత వహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
దేశవ్యాప్తంగా కుక్కకాటు ఘటనలపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో, పెంపుడు జంతువుల యాజమాన్యంపై మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ నిర్ణయాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.
Also read:
