Udaya Bhanu: వేణుమాధవ్‌ను గుర్తుచేసుకుని ఎమోషనల్

Udaya Bhanu

Udaya Bhanu

తెలుగు ప్రేక్షకులకు యాంకర్ఉదయభాను (Udaya Bhanu) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు బుల్లితెరపై తన యాంకరింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. పలు కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా వేణుమాధవ్‌తో కలిసి చేసిన కార్యక్రమాలు అప్పట్లో మంచి ఆదరణ పొందాయి. తాజాగా తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఉదయభాను.. వేణుమాధవ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

డ్యాన్స్ బేబీ డ్యాన్స్, వన్స్ మోర్ ప్లీజ్ వంటి కార్యక్రమాల్లో ఉదయభాను, వేణుమాధవ్ కలిసి సందడి చేశారు. వేణుమాధవ్ తన పంచ్‌లు, మిమిక్రీతో నవ్విస్తే.. ఉదయభాను (Udaya Bhanu) యాంకరింగ్‌తో కార్యక్రమాలకు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు. ఈ జోడీ అప్పట్లో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

వేణుమాధవ్ చివరి రోజుల్లో నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఇదే.. మరుసటి రోజే ఆ  వార్త విని షాకయ్యా.. ఉదయభాను..

వేణుమాధవ్ తనను చిన్నప్పటి నుంచే తెలుసునని ఉదయభాను చెప్పారు. తన స్వభావం, తాను ఎలాంటి విషయాలకు భావోద్వేగానికి గురవుతానో కూడా ఆయనకు బాగా తెలుసని తెలిపారు. ఇతరులతో సరదాగా, కొంటెగా మాట్లాడే వేణుమాధవ్.. తన విషయంలో మాత్రం ఎప్పుడూ గౌరవంగా ఉండేవారని గుర్తుచేసుకున్నారు. తనపై కూడా సరదాగా పంచ్‌లు వేసేవారని చెప్పారు.

వేణుమాధవ్ ఆరోగ్యం గురించి ఒకసారి ఆందోళన వ్యక్తం చేస్తూ ఫోన్ చేసిన సందర్భాన్ని కూడా ఉదయభాను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని, ప్రాణం ఉంటే ఏదైనా సాధించవచ్చని తాను చెప్పినట్లు తెలిపారు. అయితే ఆ తర్వాత వేణుమాధవ్ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు.

వేణుమాధవ్ అద్భుతమైన నటుడని, ఆయన స్థానాన్ని మరొకరు భర్తీ చేయడం చాలా కష్టమని ఉదయభాను అన్నారు. బ్రహ్మానందం, వేణుమాధవ్, కోట శ్రీనివాసరావు వంటి నటులు తమ హావభావాలతోనే ప్రేక్షకులను నవ్వించగలిగారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రతిభావంతులు తెలుగు చిత్ర పరిశ్రమకు దొరకడం అదృష్టమని, వేణుమాధవ్ చిన్న వయసులోనే దూరమవడం సినీ పరిశ్రమకు తీరని లోటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Also read: