గోదావరి పుష్కరాలు–2027ను దృష్టిలో పెట్టుకుని (Hyderabad) తెలంగాణలో పర్యాటక మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులు, పర్యాటకులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందించేలా పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపడుతున్నట్లు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TG TDC) ఎండీ గౌతమి తెలిపారు.

వివిధ అభివృద్ధి పనులను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP), ఈ-ప్రొక్యూర్మెంట్ విధానాల్లో చేపట్టేందుకు అర్హత కలిగిన సంస్థలు, కాంట్రాక్టర్ల నుంచి బిడ్లను ఆహ్వానించినట్లు ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బాసర, కాళేశ్వరంలో పర్యాటకులను ఆకట్టుకునేలా అత్యాధునిక మల్టీమీడియా ‘సౌండ్ అండ్ లైట్ షో’లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (EOI)లను ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టులు ఆయా ప్రాంతాల చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను మరింత ఆకర్షణీయంగా పరిచయం చేసేలా ఉండనున్నాయి.

గోదావరి పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల భద్రతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం పడవలు, మ్యాజిక్ ఫ్లోటింగ్ జెట్టీలు, లైఫ్ జాకెట్లు, లైఫ్ బోయ్లు, రెస్క్యూ ట్యూబ్లు వంటి అత్యవసర రక్షణ పరికరాలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక టెండర్లను ఆహ్వానించారు.
మరోవైపు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని ప్రముఖ బౌద్ధ పర్యాటక కేంద్రం బుద్ధవనం వద్ద భారీ అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్ఫర్ (BOT), PPP విధానాల్లో రివర్ఫ్రంట్ ఫైవ్స్టార్ రిసార్ట్తో పాటు బడ్జెట్ హోటల్-కమ్-వేసైడ్ అమెనిటీని అభివృద్ధి చేసేందుకు టెండర్ ప్రక్రియ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
ఇక (Hyderabad) హైదరాబాద్ నగర పర్యాటకానికి సంబంధించి కూడా కీలక ప్రకటన వెలువడింది. నగరంలోని చారిత్రక ప్రదేశాలను సందర్శించే పర్యాటకుల కోసం డబుల్ డెక్కర్ ‘హాప్–ఆన్ హాప్–ఆఫ్’ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ సేవలను నిర్వహించేందుకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP)లను ఆహ్వానించారు.
రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక మౌలిక వసతులను బలోపేతం చేయడం, సందర్శకులకు మెరుగైన ప్రమాణాలతో సేవలు అందించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యమని TG TDC వెల్లడించింది.
Also read:
