CloudSEK తాజాగా విడుదల చేసిన నివేదిక దేశవ్యాప్తంగా(IPL) ఐపీఎల్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. టికెట్ బుకింగ్ పేరుతో భారీ స్థాయిలో డిజిటల్ మోసాలు జరుగుతున్నాయని సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ల కోసం ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసే అభిమానులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా స్కామ్లకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది.
సమాచారం ప్రకారం, దాదాపు 1,000కు పైగా నకిలీ వెబ్సైట్లు రూపొందించి అభిమానులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఫేక్ సైట్లు ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్లు అయిన BookMyShow మరియు District యాప్ల మాదిరిగానే కనిపించేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అసలు వెబ్సైట్లను పోలి ఉండటంతో చాలా మంది వీటిని గుర్తించలేకపోతున్నారు.
ఈ నకిలీ సైట్లలో “టికెట్లు త్వరగా అయిపోతున్నాయి”, “సేల్ ముగియబోతోంది” వంటి కౌంట్డౌన్ టైమర్లు చూపిస్తూ అభిమానులను తొందరపెడుతున్నారని సైబర్ నిపుణులు చెబుతున్నారు. మ్యాచ్ టికెట్లు మిస్ అవుతాయనే భయంతో చాలా మంది వెంటనే చెల్లింపులు చేస్తుండగా, ఆ డబ్బు నేరుగా సైబర్ మోసగాళ్ల ఖాతాలకు వెళ్తోందని వెల్లడించారు.
ముఖ్యంగా (IPL) ఐపీఎల్ క్రేజ్ ఎక్కువగా ఉన్న నగరాల్లో ఈ స్కామ్లు అధికంగా జరుగుతున్నాయని సమాచారం. సోషల్ మీడియా ప్రకటనలు, ఫేక్ లింకులు, మెసేజ్లు మరియు నకిలీ ఆఫర్ల ద్వారా అభిమానులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు సైబర్ నేరగాళ్లు అసలు వెబ్సైట్ల మాదిరిగానే లోగోలు, కలర్స్ మరియు బుకింగ్ ఇంటర్ఫేస్ను కూడా ఉపయోగిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సైబర్ సెక్యూరిటీ నిపుణులు అభిమానులకు పలు సూచనలు చేస్తున్నారు. టికెట్లు బుక్ చేసేముందు వెబ్సైట్ అడ్రస్ను జాగ్రత్తగా పరిశీలించాలని, అధికారిక యాప్లు లేదా వెబ్సైట్ల ద్వారానే బుకింగ్ చేయాలని సూచిస్తున్నారు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు.
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఈ హెచ్చరిక సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు మరింత అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
Also read:
