దేశంలో ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు నటుడు, బీజేపీ మాజీ నేత నరేష్ (ActorNaresh) సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడకంపై తనకు ఉన్న ఆందోళనను వ్యక్తం చేస్తూ, వాహన యజమానులపై దీని ప్రభావం గురించి ప్రశ్నలు లేవనెత్తారు.
నరేష్ తన పోస్టులో తాను దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూనే, ఇథనాల్ పెట్రోల్ కారణంగా కొన్ని వాహనాల ఇంజిన్లకు నష్టం కలుగుతోందనే ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. తన స్నేహితుడి టయోటా కామ్రీ కారులో ఇంజిన్ వాల్వులను మార్చాల్సి వచ్చిందని, దానికి భారీగా ఖర్చు అయిందని ఉదాహరణగా చెప్పారు. అదే పరిస్థితి తన ఖరీదైన కారుకు ఎదురైతే మరింత వ్యయం అవుతుందని పేర్కొంటూ, తాను ప్రస్తుతం హై ఆక్టేన్ 100 పెట్రోల్ను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.
సాధారణంగా ద్విచక్ర వాహనాలు లేదా మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే వాహనాల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇథనాల్ విధానాన్ని అమలు చేసే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణ ముఖ్యమైన లక్ష్యమే అయినప్పటికీ, వాహనదారులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇథనాల్ వినియోగాన్ని దశలవారీగా అమలు చేసిన ఇతర దేశాల అనుభవాలను కూడా పరిశీలించాలని (ActorNaresh) నరేష్ సూచించారు. బ్రెజిల్ వంటి దేశాలు క్రమంగా ఈ విధానాన్ని అమలు చేశాయని, భారత్లో కూడా అలాంటి విధానాన్ని అనుసరించే అవకాశం పరిశీలించాలని అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా, ఈ అంశం ప్రజల్లో అసంతృప్తికి దారితీసే అవకాశం ఉందని, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారగా, ఇథనాల్ మిశ్రమ ఇంధనంపై అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also read:
