(Warangal) వరంగల్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను వరంగల్ కమీషనరేట్ పోలీసులు పట్టుకున్నారు. సైబర్ మోసాలకు పాల్పడుతున్న 22 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ ముఠాకు దేశవ్యాప్తంగా నమోదైన 185 సైబర్ నేర కేసులతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ముఠా కార్యకలాపాల వెనుక ఉన్న కీలక వ్యక్తుల కోసం పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తక్కువ వడ్డీకి ముద్ర రుణాలు ఇప్పిస్తామని అమాయకులను నమ్మించి వారి పేర్లతో బ్యాంకు ఖాతాలను తెరిపించేవారు. అనంతరం ఖాతాదారులకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు కమిషన్ ఇస్తామని చెప్పి బ్యాంకు పాస్బుక్లు, ఏటీఎం కార్డులు, చెక్బుక్లను తీసుకునేవారు. ఇలా సేకరించిన ఖాతాలను ‘మ్యూల్ అకౌంట్లు’గా ఉపయోగించి సైబర్ నేరాల ద్వారా వచ్చిన అక్రమ నగదును ఇతర ఖాతాలకు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల నుంచి భారీగా బ్యాంకింగ్, డిజిటల్ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 216 బ్యాంకు పాస్బుక్లు, 8 చెక్బుక్లు, 22 ఏటీఎం కార్డులతో పాటు సిమ్ కార్డులు, స్మార్ట్ఫోన్లు, హార్డ్డిస్క్లు, క్యూఆర్ స్కానర్లు ఉన్నాయి. రెండు కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్ (Warangal) కేంద్రంగా సాగిన ఈ సైబర్ నేరాల నెట్వర్క్ ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ వరకు విస్తరించినట్లు దర్యాప్తులో తేలింది. ప్రధాన సూత్రధారుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఒడిశా, ఛత్తీస్గఢ్లో ఇద్దరు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరో నలుగురు కీలక నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమీషనరేట్ కమిషనర్ శ్వేత ప్రజలకు కీలక సూచనలు చేశారు. తక్కువ వడ్డీ రుణాలు, అధిక కమిషన్ వంటి ఆశ చూపించే వ్యక్తుల మాటలు నమ్మి తమ బ్యాంకు ఖాతాలు, పాస్బుక్లు, ఏటీఎం కార్డులు లేదా వ్యక్తిగత వివరాలను ఇతరులకు ఇవ్వవద్దని సూచించారు. తమ ఖాతాలను సైబర్ నేరాలకు ఉపయోగించేలా చేస్తే చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.
Also read:
