మధ్యప్రదేశ్లోని (Ujjain) ఉజ్జయిని నగరంలోని ప్రాచీన ఖడే హనుమాన్ ఆలయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సుమారు 170 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి సంబంధించిన హనుమాన్ విగ్రహాన్ని రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించగా.. భారీ యంత్రాలతో లాగినా విగ్రహం అంగుళం కూడా కదల్లేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
సింహస్థ 2028 కుంభమేళా ఏర్పాట్లలో భాగంగా (Ujjain) ఉజ్జయినిలో పలు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కంఠాల్ చౌరాహా–ఛత్రీ చౌక్ రహదారిపై ఉన్న ఖడే హనుమాన్ ఆలయాన్ని తొలగించినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే విగ్రహాన్ని తరలించే క్రమంలో జేసీబీలు, క్రేన్లు ఉపయోగించినా అది కదల్లేదని, నాలుగు రోజుల పాటు ప్రయత్నాలు జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ అయింది. ఇందోర్ నుంచి నిపుణులను కూడా రప్పించినట్లు ప్రచారం జరిగింది.

ఈ ఘటనపై స్థానిక భక్తులు, ప్రజలు దైవశక్తి మహిమగా భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి ఉజ్జయిని అధికారులు భిన్నమైన వివరణ ఇచ్చారు.
ఉజ్జయిని SDM L.N. గార్గ్ ప్రకారం.. ఇప్పటివరకు ఖడే హనుమాన్ విగ్రహాన్ని తరలించేందుకు యంత్రాలతో కానీ, మానవ ప్రయత్నాలతో కానీ ఎలాంటి ప్రయత్నం జరగలేదు. విగ్రహాన్ని పలుమార్లు తరలించేందుకు ప్రయత్నించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆయన తెలిపారు.

విగ్రహాన్ని తరలించే అంశంపై నిపుణుల పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అదే సమయంలో భక్తుల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం, అధికారుల వివరణపై ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది.
Also read:
