ఉత్తరప్రదేశ్లోని మెరాదాబాద్ జిల్లా రాణినగల్ గ్రామంలో జరిగిన ఓ (Marriage) వివాహం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు పిల్లల తల్లి తబస్సుమ్, ఆరుగురు పిల్లల తండ్రి మహమ్మద్ ఉమర్ను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ తమ గత జీవితాల్లో ఎదురైన ఒంటరితనాన్ని అధిగమించి, పరస్పరం అర్థం చేసుకున్న తర్వాత కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
తబస్సుమ్ భర్త రియాజుల్ సుమారు ఐదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె తన ముగ్గురు పిల్లల బాధ్యతను చూసుకుంటూ అత్తమామలతో కలిసి జీవిస్తున్నారు. మరోవైపు కోర్బంక్ ప్రాంతంలో మెకానిక్గా పనిచేసే మహమ్మద్ ఉమర్కు ఆరుగురు పిల్లలు ఉన్నారు. అయితే అతడి మొదటి భార్యతో సంబంధం కొనసాగకపోవడంతో ఆమె మరో వివాహం చేసుకున్నట్లు సమాచారం.
ఈ పరిస్థితుల్లో తబస్సుమ్, ఉమర్ మధ్య పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా ఆ పరిచయం బలపడటంతో, ఇద్దరూ తమ భవిష్యత్తు గురించి చర్చించుకుని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని తొలుత కుటుంబ సభ్యులకు తెలియజేయలేదని సమాచారం.
తబస్సుమ్, ఉమర్ మొదట కలియార్ షరీఫ్లో (Marriage) వివాహం చేసుకున్న అనంతరం కోర్టు మ్యారేజ్ కూడా చేసుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు, బంధువులకు తెలియడంతో కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. పరిస్థితి వివాదాస్పదంగా మారడంతో గ్రామ పెద్ద జాహిద్ హుస్సేన్ సమక్షంలో పంచాయతీ నిర్వహించారు.
పంచాయతీలో తబస్సుమ్, ఉమర్ ఇద్దరూ తమ వివాహం పూర్తిగా పరస్పర అంగీకారంతోనే జరిగిందని స్పష్టం చేశారు. అలాగే ఇకపై కలిసి జీవించాలనే తమ నిర్ణయాన్ని వెల్లడించారు. తబస్సుమ్ నిర్ణయంపై ఆమె అత్తమామలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇకపై ఆమెతో తమకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పినట్లు సమాచారం.
మరోవైపు ఉమర్ తన భార్య తబస్సుమ్తో పాటు ఆమె ముగ్గురు పిల్లల బాధ్యతను కూడా స్వీకరిస్తానని పంచాయతీలో హామీ ఇచ్చారు. అద్దె ఇల్లు, కొనుగోలు చేసిన స్థలం, పిల్లల బాధ్యత వంటి అంశాలకు సంబంధించి అఫిడవిట్లు సమర్పించినట్లు సమాచారం. ఈ విషయాలపై పంచాయతీలో ఒక అవగాహనకు వచ్చిన తర్వాత వివాదం ముగిసింది.
ఆ తర్వాత తబస్సుమ్ తన సామాను సర్దుకుని ముగ్గురు పిల్లలతో కలిసి ఉమర్తో కొత్త ఇంటికి వెళ్లారు. తబస్సుమ్కు ముగ్గురు, ఉమర్కు ఆరుగురు కలిపి మొత్తం తొమ్మిది మంది పిల్లలు ఉండటంతో ఈ కుటుంబం ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. పిల్లలందరూ భవిష్యత్తులో ఒకే ఇంట్లో కలిసి ఉంటారా లేదా వేర్వేరుగా ఉంటారా అనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ఈ వివాహం ద్వారా ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడంతో పాటు, తొమ్మిది మంది పిల్లల బాధ్యతను కూడా కలిసి స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో ఈ ఘటనపై ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Also read:
