మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం (Shirdi) షిర్డీ సాయిబాబా ఆలయంలో ఈ ఏడాది గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన సాయిభక్తులతో ఆలయ పరిసరాలు మూడు రోజుల పాటు భక్తి పారవశ్యంతో కళకళలాడాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా గురుదక్షిణ సమర్పించేందుకు లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించగా, గత ఏడాది నమోదైన విరాళాల రికార్డును అధిగమిస్తూ ఈసారి కొత్త రికార్డు నమోదైంది.
జూలై 28 నుంచి 30 వరకు నిర్వహించిన గురు పూర్ణిమ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు సమర్పించారు. షిర్డీ (Shirdi) సాయిబాబా సంస్థాన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మూడు రోజుల్లో మొత్తం రూ.7.81 కోట్లకు పైగా విరాళాలు అందాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సుమారు రూ.1.5 కోట్ల మేర అధికంగా విరాళాలు వచ్చినట్లు సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గోరక్ష్ గదిల్కర్ తెలిపారు. భక్తుల విశ్వాసం, సాయిబాబాపై ఉన్న భక్తి మరింత పెరుగుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.

విరాళాల కౌంటర్ల ద్వారా కోట్ల రూపాయలు సమకూరగా, పీఆర్ఓ కార్యాలయం ద్వారా కూడా గణనీయమైన విరాళాలు అందాయి. అంతేకాకుండా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ చెల్లింపులు, చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టులు, మనీ ఆర్డర్ల రూపంలో కూడా భారీ మొత్తంలో నిధులు సంస్థాన్కు చేరాయి. విదేశాల్లోని సాయిభక్తులు కూడా విదేశీ కరెన్సీ రూపంలో విరాళాలు సమర్పించడం విశేషం.
నగదు విరాళాలతో పాటు భక్తులు బంగారం, వెండి ఆభరణాలను కూడా పెద్ద మొత్తంలో సమర్పించారు. సుమారు 1.125 కిలోలకుపైగా బంగారం, అలాగే 2.376 కిలోలకుపైగా వెండి ఆలయానికి కానుకగా లభించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విలువైన కానుకలు కూడా మొత్తం విరాళాల విలువను మరింత పెంచాయి.

గురు పూర్ణిమ వేడుకల సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి పాదయాత్రగా వచ్చిన సాయి భక్తులకు షిర్డీ సాయి ధర్మశాలలో ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించారు. మొత్తం 39 పల్లకీలతో వచ్చిన భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు సంస్థాన్ తెలిపింది. ఈ ఏడాది గురు పూర్ణిమ వేడుకలు భక్తుల విశేష స్పందనతో చారిత్రాత్మకంగా నిలిచాయని అధికారులు పేర్కొన్నారు.
Also read:
